
- ఇక్కత్ తయారీ పుస్తకాల్లో చదివా.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశా
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
యాదాద్రి/భూదాన్పోచంపల్లి, వెలుగు : చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న భరోసా, నేతన్నబీమా, త్రిఫ్ట్ స్కీమ్స్ బాగున్నాయని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చెప్పారు. ఈ స్కీమ్స్ నేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భూదాన్పోచంపల్లిలో పర్యటించిన గవర్నర్ నేత కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మగ్గం నేసే విధానం, టూరిజం టెక్స్టైల్ పార్క్లో ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం టెక్స్టైల్ పార్క్లో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ.. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల గురించి గతంలో పుస్తకాల్లో మాత్రమే చదివానని.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం ఆనందంగా ఉందన్నారు. పోచంపల్లి నేత కార్మికులు వస్త్రాలను నేయడంతో పాటు కలర్, మార్కెటింగ్, డిజైనింగ్ కూడా వారే చూసుకోవడం వల్ల ఇక్కత్ ఉత్పత్తులను విస్తృతం చేసే అవకాశం లేకుండా పోతోందన్నారు.
ఇక్కడి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు, మార్కెట్ పెరిగేలా అహ్మదాబాద్లోని ఎన్ఐటీ, ఐఐటీ సహకారంతో స్థానిక కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రావడంతో అమ్మకాలు 30 శాతం పెరిగాయని కార్మికులు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. హెల్త్ కార్డులతో పాటు సబ్పిడీపై నూలు అందించే సెంటర్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.
నేతన్న రుణాల కింద ఉపేందర్, భాగ్యలక్ష్మి, యాదగిరికి మంజూరైన రూ. 5 లక్షల చెక్కులను గవర్నర్ అందజేశారు. అలాగే నేతన్న పొదుపు పథకం కింద యాదాద్రి జిల్లాకు రూ. 2,17,27,200 చెక్కును నేత కార్మికులకు అందించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, కార్మికులు గజం అంజయ్య, గజం గోవర్దన్ పాల్గొన్నారు.
చేనేతను ఆదుకుంటున్నం : శైలజా రామయ్యర్
చేనేతను కాపాడడంతో పాటు కార్మికులకు అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నామని చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చెప్పారు. కార్మికులకు త్రిఫ్ట్ స్కీమ్, ఇన్సూరెన్స్, రుణమాఫీ, నేతన్న భరోసా వంటి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. టెస్కో ద్వారా చేనేత మెటీరియల్ను సేకరిస్తున్నామని చెప్పారు.